Heavy Rain Alert
గురువారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం అనంతరం రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలోకి చేరే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు , అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, ఏలూరు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్,అన్నమయ్య,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, నిజామాబాద్, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్నగర్ మరియు ఆదిలాబాద్ జిల్లాలకు MHA ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జంగం, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది.