DSC Free Coaching For Tribal Candidates
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించింది. ఈ నేపథ్యంలో గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణకు సంబంధించి గిరిజన సంక్షేమశాఖ కీలక ప్రకటన వెలువరించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన సంక్షేమశాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా గిరిజన అభ్యర్థులకు ఉచితంగా మూడు నెలలపాటు డీఎస్సీ శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాల వారీగా దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం 2,150 మంది దరఖాస్తు చేసుకున్నారు. గిరిజన ఏజెన్సీ ప్రాంతాల నుంచి అధిక దరఖాస్తులు వచ్చాయి. గిరిజనేతర ప్రాంతాల నుంచి తక్కువ సంఖ్యలో వచ్చాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని 6 ఐటీడీఏల్లోనూ ప్రతి చోటా ఒక్కొక్క శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. గిరిజనేతర ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా రెండు లేదా మూడు చోట్ల శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒక్కో శిక్షణ కేంద్రంలో 100 నుంచి 150 మందికి శిక్షణ ఇస్తారు. త్వరలో ఉచిత శిక్షణ ప్రారంభం కానుంది.
అభ్యర్థులకు మూడు నెలలపాటు శిక్షణ ఇస్తారు. వసతి, భోజనం, మెటీరియల్ను ఉచితంగా ప్రభుత్వమే అందించనుంది. ఇందుకుగాను ఒక్కో అభ్యర్థిపై రూ.25 వేల వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. తొలి విడతలో వెయ్యి మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్కు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం: ఇక్కడ క్లిక్ చేయండి